17-06-2025 07:59:32 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం హనుమకొండ హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణాలు, రూఫ్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ వరకు చేరుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రవీందర్, డీఈ సిద్ధార్థ నాయక్, డిప్యూటీ తహసిల్దార్ రహీం పాషా, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు..
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భారతి చట్టాన్ని అమలు చేస్తుందని, భూ సమస్యలున్నవారు భూభారతి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం సూదన్ పల్లి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రెవెన్యూ అధికారులు భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న రైతులు, స్థానికులతో కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి భూ సమస్య ఉందని, కాస్తులో ఉన్నారా, సాదాబైనామాకు దరఖాస్తు చేశారా, భూములు అమ్మిన వారికి పాసుబుక్కులు ఉన్నాయా లేదా, భూములకు సంబంధించి ఎలాంటి ఆధారాలతో క్రయవిక్రయాలు చేశారు, తదితర భూ సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలి..
3 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి అధ్యక్షతన 49వ డివిజన్ జులైవాడ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట-అంగన్వాడి బాట ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కూడా అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు. 30 మంది మూడు సంవత్సరాల నిండిన పిల్లలకి జిల్లా కలెక్టర్, కార్పొరేటర్ లు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హనుమకొండ సిడిపిఓ ఎం విశ్వజ, సూపర్వైజర్స్ వి.రాజలక్ష్మి, ఎం.జ్యోతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ డి. ప్రీతి, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ డి.కళ్యాణి అండ్ స్టాప్, సఖి అడ్మిన్ హైమావతి అండ్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు ఎం ప్రసన్న, రమాతార , అంగన్వాడి హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి లబ్ధిదారులు పాల్గొన్నారు.