calender_icon.png 18 June, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదు..

17-06-2025 08:08:20 PM

నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు 5.5 మీటర్ల వెడల్పు ఉండాల్సిందే

నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం కోసం, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తా

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి...

మునుగోడు (విజయక్రాంతి): నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు 5.5 మీటర్ల వెడల్పు ఉండాల్సిందేనని రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనుల పురోగతిపై మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సాగర్ రోడ్డు నుండి ముష్టిపల్లి వరకు, ముష్టిపల్లి నుండి నాంపల్లి వరకు జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అంగడిపేట నుండి లెంకలపల్లి వరకు చేపట్టబోయే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రొసీజర్ ఎంతవరకు వచ్చిందని, నాంపల్లి నుండి ఇడికుడ వరకు, ఇడికుడ నుండి కమ్మగూడెం (తెరట్ పల్లి) వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చిన తర్వాత వాటి పనులకు సంబంధించి పురోగతిపై ఆరా తీశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా  జరుగుతున్న పిఆర్ రోడ్ల  పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు. ప్రస్తుతం  జరుగుతున్న 57 రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పటి వరకు పూర్తవుతాయని, 34 పి ఆర్ రోడ్లు టెండరింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న 89  రోడ్డు పనుల ప్రోగ్రెస్ పై ఫోకస్ పెట్టి ప్రతిరోడ్డు 5.5 మీటర్లు వెడల్పుతో నాణ్యతతో నిర్మించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పిఆర్ రోడ్డు 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్ల వెడల్పుకి మార్చాలని అధికారులను ఆదేశించారు. విడతల వారీగా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను నిర్మాణం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం కోసం, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెప్పించే బాధ్యత నాదని, నాణ్యత రోడ్ల నిర్మాణం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని కాంట్రాక్టర్లకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లతోపాటు, పంచాయతీరాజ్ ఈ ఈ గిరిధర్, ఆర్ అండ్ బి మునుగోడు  డి ఈ శరత్ చంద్ర, పి ఆర్ ఎ ఈ సతీష్ ఉన్నారు.