17-06-2025 07:55:18 PM
ఎస్పీ శరత్ చంద్ర పవార్..
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న(అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు.
కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి సి.సి.టి.యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతీ రోజు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు.కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృ ష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలిగించే విధంగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలున్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ కృషి చేయాలని అన్నారు.అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని అన్నారు.విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయిని ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా క్రయ విక్రయాలపైన, జూదం, పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రిపీటెడ్ గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రతి వాహనాన్ని మంచి కండీషన్లో ఉండే విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి అని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ వాహనాలను తనిఖీ కార్యక్రమంలో అన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో గల వాహనాల నిర్వహణ లోటు పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారి కి తెలియజేశారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు.
పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంల మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించాలని అన్నారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహన వేగం పరిమితికి లోబడి నడపాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, సి.ఐ లు, యస్.ఐ లు పాల్గొన్నారు.