28-05-2025 12:00:00 AM
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
పేదలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యం
బ్రాహ్మణగావ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చర్యలు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడి
భైంసా, మే ౨౭(విజయక్రాంతి): ఇండ్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పం చాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క స్పష్టం చేశారు. మంగళవారం ముధో ల్ మండలం బ్రాహ్మణగావ్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి సీతక్కకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, భవనంలోని గదులను పరిశీలించారు. ప్లాస్టి క్ నిర్మూలనకు చర్యగా ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. అనంతరం దౌనెల్లి నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు, తానూర్ బిటి రోడ్డు, ఇతర అభివృద్ధి పనులకుగాను శిలాఫలకాలు ఆవిష్కరించారు.
అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసి న బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దాదాపు రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడం సంతోషకరమన్నారు. ఇందులో భాగంగా రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.1.90 కోట్లతో కుంటాలదౌనెల్లి బీటీ రోడ్, రూ.5.90 కోట్లతో తానూర్హుండా బీటీ రోడ్ రినివల్, రూ.10 కోట్లతో ముధోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు.
బ్రాహ్మణగావ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో ఇండ్లు లేని నిరుపేదులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని, తదుపరి దశలవారీగా అందరికీ ఇండ్లు కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఎవరికైనా అనర్హులకు ఇండ్లు మంజూ రైనట్టు అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించబడ్డాయని, అర్హులైన నిరుపేదలందరికీ విడతలవారీగా ఇండ్లు అందజేస్తామన్నారు.
అనంతరం పలువురు ఇందిరమ్మ ఇండ్ల మహిళా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.