18-06-2025 07:01:09 PM
ఇండ్ల కేటాయింపుల్లో అవినీతి అక్రమలను అరికట్టాలి..
కౌలు రైతులకు వెంటనే రైతు భరోసా వర్తింపజేయాలి..
సన్న వడ్లకు బోనస్ వెంటనే చెల్లించాలి..
బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి & మాజీ జడ్పీ చైర్పర్సన్..
తాడ్వాయి (విజయక్రాంతి): జిల్లాలలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ(Mulugu Constituency) ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని బీరెల్లి గ్రామంలో అర్హులైన నీరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
జిల్లాలలో అర్హులకు కాకుండా అనర్హులకు కట్టబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన లబ్ధిదారులను జాబితాలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డబ్బులు చెల్లించిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలల అయినా కూడా ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదని, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. సన్న ధాన్యానికి ఇచ్చే 500 బోనస్ వెంటనే చెల్లించాలని రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్యనే అని అన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు దుండగుల మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, మాజీ మండల అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు, మహిళా మండల అధ్యక్షురాలు సామ నాగక్క,బీరెల్లి మాజీ సర్పంచ్ జాజా చంద్రం, గ్రామ కమిటీ అధ్యక్షులు దాయ రోషన్న, మాజీ మండల ఉపాధ్యక్షులు పెనక విశ్వనాథం, జిల్లా నాయకురాలు ఇరుప విజయ, సమన్వయ కమిటీ సభ్యులు జాడి బాబురావు, సీనియర్ నాయకులు మోరే నరసింగరావు, భాషని సురేష్, బెజ్జూరి శ్రీకాంత్, బాగే రాములు, లక్ష్మణ్, బీరెల్లి సోషల్ మీడియా గడదాసు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.