16-06-2025 05:39:36 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు అందించి, నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకొని, నిర్మాణంలో ఉన్న ఇండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి లబ్ధిదారులకు డబ్బులు మంజూరు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, విద్య, వైద్యం తదితర సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో ఇప్పటికే 90 శాతం వెరిఫికేషన్ పూర్తిచేసి, క్షేత్రస్థాయిలో అనుమతి ఇవ్వడం జరిగిందని, లబ్ధిదారులకు ప్రెసిడెంట్ కాపీలు కూడా ఇవ్వడం పూర్తయిందని, ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవెల్ పూర్తికాగానే దశల వారీగా బిల్లు చెల్లించాలని, జూన్ 30 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారిని గుర్తించి గ్రామైక్య సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ మంజూరు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా చూడాలన్నారు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్ళలో అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించాలని, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్, డిన్నర్ మెనూ ప్రకారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడనైనా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ అందించాలని, విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో మందులకు కొడత లేకుండా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సీఈవో పురుషోత్తం, పిడి మధుసూదన్ రాజ్, డిసిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ హరిప్రసాద్, డిఈవో రవీందర్ రెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు నరసింహస్వామి, ధనమ్మ, డీఏవో విజయనిర్మల, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా నాయక్, డిహెచ్ఓ మరియన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.