08-08-2025 12:39:23 AM
కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి) ః ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ కాలనీ, గర్గుల్ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బేస్మెట్ వరకు నిర్మాణం పూర్తయిన ఇండ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు అయ్యాయా..? అని అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తదని రవాణా ఖర్చులు పెట్టుకొని వాటిని తీసుకుని వచ్చి నాణ్యతగా ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంటి నిర్మాణం పూర్తయిన, ఇంటి నిర్మాణం వివిధ స్టేజీలను బట్టి బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సాగుమాగ్రికి ఎలాంటి సమస్య తలెత్తకుండా రెగ్యులర్ గా పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి లను ఆదేశించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, టి పి ఓ గిరిధర్, ఆర్ ఐ రవి గోపాల్ రెడ్డి, పాల్గొన్నారు.