29-05-2025 01:13:15 AM
దేవరకొండ, మే 28 : దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి కలను సాకారం చేసేందుకే ఇందిరమ్మ గృహ నిర్మాణాలు లాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి.. లబ్దిదారుల దీవెనలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయన్నారు.
ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వ ఇండ్ల పథకం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు పోతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రమణా రెడ్డి, హౌసింగ్ పిడి రాజ్ కుమార్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.