07-06-2025 01:48:38 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్లతో నిలువ నీడలేని నిరుపేదలకు శాశ్వతంగా నిలువ నీడ కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 చొప్పున మంజూరు చేస్తున్నారని, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.
మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేసముద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి, మాట తప్పిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అలాకాకుండా ఇచ్చిన హామీ మేరకు నిలువ నీడలేని పేదలకు 5 లక్షల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో దశలవారీగా ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి సరైన విధంగా లేనప్పటికీ, పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం, అధికారులు సూచించిన, నిర్దేశించిన విధంగా ఇల్లు కట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, ఎంపీడీవో క్రాంతి తదితరులు పాల్గొన్నారు.