calender_icon.png 30 May, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ హౌస్‌లాగే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి

29-05-2025 12:54:11 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

తూప్రాన్/చేగుంట/రామాయంపేట, మే 28 :  ప్రభుత్వం నిర్ధారించిన ఇందిరమ్మ ఇంటి నమూనా ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు  లబ్ధిదారులు తమ ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  తెలిపారు.

బుధవారం ఆయన జిల్లాలో పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తూప్రాన్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంటి లోపల డిజైన్, సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతీకగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి దశలో ఉన్నాయని జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఈ మోడల్ హౌస్ ను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణ శాఖ పిడి మాణిక్యంకు ఆదేశించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు పూర్తి సబ్సిడీతో అందిస్తుందని, మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకున్నట్లయితే బిల్లులు త్వరితగతిన మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 

కొనుగోలు కేంద్రం సందర్శన..

తూప్రాన్ మండలం దండుపల్లి సెంటర్, మనోహరాబాద్ మండల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. దండుపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుధి దశలో ఉన్నందున త్వరితగతిన కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పూర్తి చేసి మిల్లుకు ధాన్యం తరలించాలని నిర్వహకులను ఆదేశించారు. అకాల వర్షాలకు రైతులు అధైర్య పడవద్దని, ప్రతి రైతు పండిచిన ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు పూర్తి చేసే వరకు ప్రతి సెంటర్ కూడా పనిచేస్తుందని జిల్లా రైతాంగానికి హామీ ఇచ్చారు.

ఫర్టిలైజర్ షాపు తనిఖీ...

చేగుంట మండల కేంద్రంలోని శ్రీనివాస ఫెర్టిలైజర్ షాపును జిల్లా కలెక్టర్  రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిష్టర్, ఎరువుల నిలువలను పరిశీలించడం జరిగింది.

నకిలీ విత్తనాలను నియంత్రణలో భాగంగా వ్యవసాయ, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపుల యజమానులు గడువు తేదీలోపు అమ్మాలని, నకిలీ విత్తనాల అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. 

మల్లంచెరువు సుందరీకరణకు చర్యలు..

రామాయంపేట పట్టణంలోని మల్లం చెరువు పర్యాటక ప్రాంతంగా సుందరీకరణలో భాగంగా  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. సుందరీకరణలో గ్రీనరీ, ఫౌంటెన్, సీసీ రోడ్డు, ప్లాంటేషన్, సిటింగ్ ఏరియా .

గార్డెన్, పార్కింగ్ స్థలాలు సంబంధిత వివరాలను  ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు నూతన హంగులతో చెరువులను సుందరీకరణ  ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, తహసిల్దార్ రజని, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.