19-06-2025 12:53:58 AM
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
చివ్వెంల, జూన్ 18: సమీకృత వ్యవసాయ సాగు రైతుకు లాభదాయకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మండలములోని బి.చందుపట్ల గ్రామం లో గల మార్కాల వెంకట రెడ్డి ఆయిల్ పామ్ తోటను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయిల్ పామ్ సాగు వివరాలను, వారి క్షేత్రం లొ మామిడి, కొబ్బరి, అన్నీ రకాల పండ్లు, నాటు కోళ్ళు, గొర్రెల పెంపకంను సమీకృత పద్దతిలో చేపడుతున్నందున పూర్తి వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన జిల్లాలో ప్రస్తుతం 4885 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మొదటి నాలుగేండ్లలో ఖర్చుల కోసం ప్రభుత్వం ఎకరానికి రూ.4,200 ఆర్థిక సాయం చేయటం జరుగుతుందన్నారు.
అలాగే డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు యూనిట్ ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోందని ఒక ఏకరానికి మొత్తం రాయితీ గా రూ. 50,918 ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ సంతోష్ కుమార్, ఉద్యానవన డివిజన్ అధికారిణి స్వాతి, మండల ఉద్యానవన అధికారి మహేష్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు , పతంజలి కంపెనీ ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు