29-05-2025 12:49:23 AM
ఫలించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కృషి
పటాన్ చెరు, మే 28 : మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను పటాన్ చెరులో ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల ఏర్పాటు కోసం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 993 లో 25 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.
ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు కోసం రూ.200 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఆదర్శ పాఠశాలగా రుద్రారం జిల్లా పరిషత్
రాష్ట్రంలోనే రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను రూ.16 కోట్లతో సిఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. మైక్ లాటిక్రేట్ పరిశ్రమ సహకారంతో రూ.16 కోట్ల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూడు ఎకరాల 34 గంటల స్థలంలో 43,378 చదరపు అడుగుల విస్తీర్ణంతో 15 తరగతి గదులు, మండల పరిషత్ పాఠశాలను ఒక ఎకరా 23 గుంటల స్థలంలో 26,586 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 తరగతి గదులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులను నిర్మించబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, మైక్ లాటిక్రేట్ సంస్థ ప్రతినిధి రోహిత్ పాల్గొన్నారు.
రూ.60 లక్షలతో అదనపు తరగతి గదులు..
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 60 లక్షల నిధులతో నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం తెలిపారు. అమెరికాకు చెందిన మెడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రూ.60 లక్షలతో తరగతి గదులు నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నరసింహారావు, మేరాజ్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులుపాల్గొన్నారు.