29-05-2025 12:47:50 AM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి
హుస్నాబాద్, మే 29 : డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని కబళిస్తోందని, పల్లెలకు పాకిన దానిని తరిమేద్దామని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి పిలుపునిచ్చారు. యువతను బెట్టింగ్లకు దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన, శక్తివంతమైన సమాజం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పోరు యాత్ర బుధవారం అక్కన్నపేటలో ముగిసింది. జేఏసీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించి, అక్కన్నపేటలో బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను వివరించారు.
యువత భవిష్యత్తుకు ప్రమాదం దేశ భద్రతకు ముప్పు
జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, కో-కన్వీనర్ మేకల వీరన్న మాట్లాడుతూ, డ్రగ్స్ కేవలం వ్యక్తిగత సమస్య కాదని, ఇది సమాజాన్ని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా కుంగదీస్తున్న పెను భూతమని అన్నారు.
‘ఒకవైపు పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో మన దేశానికి యుద్ధం పొంచి ఉండగా, దేశాన్ని కాపాడుకోవాల్సిన యువతే మత్తుకు బానిసలై చనిపోవడం దేశ భద్రతకే ముప్పు‘ అని మరో కో కన్వీనర్ డ్యాగల సారయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు సౌమ్య, అరుణ, శంకర్ బాబు, భాస్కర్, మనోహర్ తమ పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.