వీజేఐఎంలో వాణిజ్య వ్యవహారాలపై అంతర్జాతీయ సదస్సు
ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ బీజే రావు
కుత్బుల్లాపూర్, మార్చ్ 28(విజయ క్రాంతి):స్థిరమైన వ్యాపార సరళిలో భవిష్యత్తు వాణిజ్య వ్యవహారాల నిర్వహణ అనే అంశంపై 7వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ లోని ప్రగతినగర్ వీజేఐఎం కళాశాలలో నిర్వహించడం అభినందనీయమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు.
గురువారం వీజేఐఎం కళాశాలలో ప్రారంభమైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బీజే రావు మాట్లాడుతూ ఈ సదస్సులో నిపుణులు అందించే సలహాలు సూచనల వలన విద్యార్ధులకు నెట్ వర్కింగ్ అవకాశాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
స్థిరమైన వ్యాపార విధానాల కోసం కృషి చేస్తున్న పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు, విద్యావేత్తలతో విద్యార్ధులు కలుసుకునే అవకాశముందన్నారు. ఈ సదస్సు వలన విద్యార్ధులకు పారిశ్రామిక రంగంలో జరుగుతున్న అనేక విషయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు వీజేఐఎం డైరెక్టర్ భరత్ భూషణ్ సింగ్, డాక్టర్ రవినాథ్, డాక్టర్ వినీత్ ,డాక్టర్ అమర్నాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.






