16-06-2025 06:05:25 PM
నిందితుల నుండి నాలుగు లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు, అర గ్రాము బంగారం స్వాధీనం..
వివరాలు వెల్లడించిన నల్గొండ డిఎస్పీకే శివరాం రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): వేరువేరు కేసుల్లో బంగారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు, అర గ్రాము బంగారం స్వాధీనం చేసినట్లు నల్లగొండ డిఎస్పీ కే శివరాంరెడ్డి(DSP Sivaram Reddy) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లాకు చెందిన బత్తుల యేసు ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడి, బాగా అప్పులు చేసి, ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, బంగారం తక్కువ రేటుకు అమ్ముతానని నమ్మించి, మభ్యపెట్టి డబ్బులు కాజేసి పారిపోవాలని నిర్ణయించుకొని గుర్తుతెలియని మగ వ్యక్తి, మరొక మహిళతో నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధిలోని దేవరకొండ రోడ్ లో ఉన్న అనస్వి మెడికల్ షాప్ వద్దకు గత సంవత్సరం 8/11/2024 నాడు వచ్చాడు.
మందులు కావాలని అడుగుతూ "నా పేరు రవి, మాది ఒంగోలు జిల్లా, ఇక్కడ బిల్డర్ గా పనిచేస్తున్నాను. నా దగ్గర కొంత పురాతన బంగారం ఉంది, దానిని నీకు తక్కువ ధరకి ఇస్తాను అని చెబుతూ ఒక బంగారు బిళ్ళని తెచ్చి చూపించాడు. దానిలో ఒక ముక్క తీసి పరీక్షించుకోమనగా ఆ షాపు యజమాని చెక్ చేయించగా ఒరిజినల్ బంగారం అని తెలిసింది. రెండు రోజులు సమయం ఇస్తాను, ఐదు లక్షలు సర్దితే 22 తులాల బంగారం బిస్కెట్ ఇస్తానని చెప్పాడు. ఆ యజమాని వెంటనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ బిస్కెట్ తీసుకొని మళ్లీ జువెలరీ షాప్ లో చెక్ చేయించుకున్నప్పుడు నకిలీ అని తెలిసింది. దీనితో మోసపోయానని గ్రహించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sarath Chandra Pawar) ఆదేశానుసారం, నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో, CCS సిఐ జితేందర్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎస్సైతో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు డీఈఓ ఆఫీస్ వద్ద సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు గతంలో కుషాయిగూడ, నల్గొండలో ఇలా నేరాలు చేయగా, కేసులై జైలుకు వెళ్లి రావడం జరిగిందన్నారు. మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉన్నది. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తే అదే బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతానని జువెలరీ షాప్ వ్యక్తిని నమ్మించి 1,20,000 నగదు కొట్టేసిన మరో అంతరాష్ట్ర నిందితుడు కూడా అరెస్టయ్యారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన పల్లె మధుకర్ రెడ్డి నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పాత బస్తిలో జువెలరీ షాప్ నిర్వహిస్తున్న గోపి కిషన్ కు ఫోన్ చేసి ఈనెల 11న తన వద్దకు వచ్చి బంగారం బ్యాంకు తాకట్టులో ఉంది. మీరు డబ్బులు కట్టి విడిపిస్తే ఆ బంగారం తక్కువ ధరకు మీకు అమ్ముతాను అని ప్రకాశం బజార్లోని యాక్సిస్ బ్యాంకులో 1,20,000 అకౌంట్లో డిపాజిట్ చేయించుకున్నాడు. షాప్ యజమాని బంగారం గురించి అడిగితే, ఎకౌంటు ఫ్రీజ్ అయిందని, తర్వాత డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి పారిపోయాడు. వెంటనే జ్యువెలర్స్ యజమాని మోసపోయానని తెలుసుకొని ఈనెల 13న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సోమవారం నిందితుని అదుపులోకి తీసుకున్నారు.
మధుకర్ రెడ్డి గతంలో హైదరాబాదులోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో స్టాక్ మార్కెట్ కి సంబంధించి సేల్స్ మేనేజర్ గా పనిచేసి, 2023లో జాబ్ మానేసి, జల్సాలకు అలవాటు పడి, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయి, ఎలాగైనా ఈజీగా డబ్బులు సంపాదించాలని బ్యాంకులో ఉన్న బంగారాన్ని డబ్బులు ఇస్తే విడిపించి తక్కువ ధరకు అమ్ముతానని మాయ మాటలు చెప్పి డబ్బులు ఎకౌంట్లో వేయించుకొని తప్పించుకొని జల్సాలు చేస్తున్నాడు. మాయమాటలు చెప్పి ఇలా మోసం చేయగా మోసపోయిన వ్యక్తులు అతనిపై ఘట్కేసర్, జూబ్లీహిల్స్, మిర్యాలగూడ, నిజామాబాద్ వన్ టౌన్, సిద్దిపేట, ఉప్పల్, నల్లగొండ వన్ టౌన్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులను డీఎస్పీ కె శివరాం రెడ్డి గ పర్యవేక్షణలో,సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వన్ టౌన్ రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో, ఎస్ఐలు శివ, సైదులు, శంకర్, సిబ్బంది రబ్బాని, శ్రీకాంత్, షకీల్ తదితరులను ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఎస్పీ అభినందించారు.