పాలమూరులో పెట్టుబడి పెట్టండి
ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్ నగర్ జూన్ ౪ (విజయక్రాంతి) : పాలమూరు ఐటి కారిడార్ లో పెట్టుబడులు పెట్టాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం అమెరికా లో ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాజీ మంత్రివ వి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లో సుమారు 450 ఎకరాలలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్, మల్టిపార్పస్ ఐటీ కారిడార్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు.
మొదటి దఫాగా కొన్ని ఐటీ కంపనీలు తీసుకువచ్చి 850 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఐటీ కారిడార్ ఉందని, అన్ని రకాల సదుపాయాలతో ఐటీ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఐటీ కారిడార్ వరకు మెట్రో వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఐటీ కారిడార్ పక్కనే అమర్ రాజా లిథియం బ్యాటరీ తయారీ కంపెనీ కూడా అక్కడ ఏర్పాటు చేశారని పరోక్షంగా.. ప్రత్యేక్షంగా పది వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికీ పూర్తి సహకారం అందిస్తామన్నారు.






