20-09-2025 12:11:26 AM
ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పాటు పూర్తి పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ఎస్పీ రాజేష్ చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి ఛార్జీషీట్ వరకు ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశోధించి ఫైనల్ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్ని స్థాయిల అధికారులను ఆదేశిం చారు.
పాత, కొత్త కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే దిశగా పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు అందుబాటులో ఉండి, సత్వర న్యాయం అందించాలన్నారు. చోరీ, ఆస్తి సంబంధిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, కొత్తగా వచ్చిన టెక్నాలజీని వినియోగించి ఛాన్స్ ప్రింట్ ద్వారా కేసులను ఛేదించాలని సూచించారు. ఎన్డీపీఎస్ కేసుల్లో నేరస్తులపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
డయల్ 100 ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.ఫేక్ నెంబర్ ప్లేట్లు, నెంబర్ ప్లేట్లు మార్పుపై ప్రత్యేక దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 22 నుండి ప్రారంభమయ్యే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడిందన్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతులు లేవని, భక్తిశ్రద్ధలతో సంప్రదాయాలకు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించడానికి పోలీసుశాఖ పూర్తి సహకారం అందిస్తుందని, ప్రజలు సామరస్యంతో శాంతిభద్రతలను కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.
డ్రంకన్ డ్రైవ్ కేసులో 33 మందికి 33 వేల జరిమానా
కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు కామారెడ్డి కోర్ట్ శుక్రవారం జరిమానా విధించిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనజిల్లాలో 33 మందికి 33వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఇందులో 8 మందికి ఒకరోజు శిక్షతో రూ.1,100 చొప్పున, ముగ్గురికి ఒకరోజు శిక్షతో పాటు రూ.1,000, 22మందికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 మంది, గాంధారి పరిధిలో ముగ్గురు, ఎల్లారెడ్డి పరిధిలో ఆరుగురు, దేవునిపల్లి పరిధిలో ఇద్దరు, మాచారెడ్డి, బీబీపేట పరిధిలో ఒక్కరు చొప్పున మొత్తం 33 మందికి 33,800 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.
వరదల సమయంలో హోంగార్డుల సేవలు హర్ష నియం
కామారెడ్డి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సంభవించిన భారీ వర్షాలు, వరదల సమయంలో హోంగార్డులు చేసిన సేవలు హర్షనీయమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో వరదలు ముంచేతాయని అన్నారు. ఆ సమయంలో పోలీసులు, హోంగార్డులు చేసిన సేవలు ప్రజలు గుర్తుంచుకునేలా నిలిచాయని ప్రశంసించారు.
ఆపద సమయంలో సేవ చేసినప్పుడే తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను రక్షించిన తీరు అభినందనీయం అన్నారు. ఇదే స్పూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఎస్పి పేర్కొన్నారు. నిజాయితీతో పని చేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. గుర్తింపుతో పాటు రివార్డులు కూడా లభిస్తాయి అని తెలిపారు. అనంతరం హోంగార్డులకు రెయిన్ కోట్స్, జరికిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు పోలీస్ అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.