20-09-2025 12:04:26 AM
కేసులు పెడుతున్న ఒకరు.. అడ్డుకుంటున్న మరొకరు..
వెలుగులోకి బలవంతపు భూ దందాలు
ఈ వ్యవహారంపై సీఎంకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన వ్యవహారం
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): పదేళ్ళలో పాలమూర్ పట్టణంలో బిఅర్ఎస్ నేతలు చేసిన అక్రమాలను వెలికితీసి వారిపై కఠిన చర్యలు తీసు కొంటాం.... ఆ నేతల బాదితులకు అండగా నిలిచి వారు పోగొట్టుకొన్న ఆస్తుల్ని తిరిగి వారికి అప్పగిస్తాం...ఇందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు..
ఈ మాటలు నమ్మి గెలిపించిన ప్రజలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు నిలువునా మోసం చేస్తున్నారని బాధితులు చెబుతోన్నా మాట ఇది. పదేళ్ళలో బిఆర్ఎస్ నేతల ఆగడాలతో పట్టణంలో పెరిగిన బాదితుల సంఖ్య కంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20నెలలోనే పట్టణంలో ఆపార్టీ నేతలు చేస్తోన్నా ఆగడాలకు బాదితుల సంఖ్య గతం కంటే రెండంతలుగా పెరిగిపోయ్యిందని పట్టణవాసులు చెబుతోన్నా మాట ఇది.
ముఖ్యంగా భూములు, ప్లాట్ల క్రయ విక్రయాల్లో అయితే కాంగ్రెస్ నేతల కన్నుసన్నల్లో జరుగుతున్నాయి. వారు చెప్పిన ధరకే విక్రయించాలి, లేదంటే పోలీసులచే బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేసుకొంటున్నారని ఆ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఆ ఇద్దరు తమదైన శైలిలో అక్రమాలు అన్యాయాలు కలిసి చేస్తోన్నా సంఘటనలపై వారి బాదితులు పోలీసు ఉన్నతాధికారులతోపాటు, సీఎం వరకు వెళ్లి పిర్యాదులు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా పాల్ కొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీనేతకు చెందిన ప్లాట్ విషయంలో ఆ ఇద్దరికి బెడిసి వారి మద్య విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చింది బిఅర్ఎస్ నేత వ్యవహారం. ఇంకేముంది..ఒకరేమో ఆ మాజీ నేతకు సంబంధించిన కట్టడాలను కూల్చాలంటూ నిత్యం అధికారులపై పిర్యాదులు చేస్తుంటే, మరొకరేమో ఆ మాజీ నేతకు అండగా నిలిచి దానిని అడ్డుకొంటున్నాడట.
ఈ వార్ తారాస్థాయికి చేరడంతో పాల కొండ మాజీనేతకు చెందిన కట్టడాలను మున్సిపల్ అధికారులచే కూల్చివేయించగా.. మరొక నేత అది ఎందుకు కూల్చారని మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేసి ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరించారట. బిఆర్ఎస్ మాజీ నేత కోసం వీరిద్దరి మద్య నెలకొన్న రచ్చ రోజు రోజుకు రగులుకొంటోంది. సొంతపార్టీ నేత కోసం అయితే ఏమో అనుకోవచ్చు కానీ, బిఆర్ఎస్ నేతను కాపాడేందుకు సొంత పార్టీలో విబేదాలు భగ్గుమంటున్నాయి.
వెలుగుల్లోకి బలవంతపు దందాలు...
పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు.. పైకి మాత్రం మాది ప్రజా పాలన అంటూ జోరుగా ప్రచారం చేస్తూ, ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, బిఅర్ఎస్ నేతలతో కలిసి జోరుగా భూ దందాలు కొనసాగిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి వ్యవహారాలు ఇన్నాళ్లు సాఫీగా సాగగా, ఇప్పుడు పాల కొండ బిఅర్ఎస్ నేత విషయంలో వారి మధ్య రగడ రగులుకొంటోంది. ఇక వారి వ్యవహారానికొస్తే..
ఒకరేమో పక్క నియోజకవర్గమైన దేవరకద్రకు చెందిన ఓ బిజెపి నేతతో కలిసి చేసిన బలవంతపు భూ దందా ఘటనపై బాదితులు నేరుగా సీఎంకు పిర్యాదు చేసి న్యాయం కోసం హైకోర్టు ద్వారా చేస్తోన్నా పోరాటం వెలుగుల్లోకి వచ్చింది. వీరితోపాటు, ఈ వ్యవహారంపై స్వయంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సైతం పార్టీ అధిష్టానం, సీఎం దృష్టికి పిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇక మరొక నేత విషయానికొస్తే ఇకడేమో బిఅర్ఎస్ నేతను వ్యతిరేకిస్తూ, పక్క నియోజకవర్గమైనా జడ్చర్లకు చెందిన బిఅర్ఎస్ నేతలతో కలిసి చేసిన బలవంతపు భూ దందాకు సంబంధించి ఆ బాధితులే నేరుగా పోలీస్ ఉన్నతాధికారులతోపాటు, సీఎంకు పిర్యాదు చేసి న్యాయం కోసం హైకోర్టులో పోరాటం చేస్తోన్నా ఘటన వెలుగుల్లోకి వచ్చింది. వీరైతే బహిరంగంగా మీడియా ద్వారా పిర్యాదులు చేస్తోన్నా పోలీసులు కేసు నమోదు చెయ్యడంలేదని బాదితులు వాపోతున్నారు.
సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చొద్దని హైకోర్టు పదే పదే హెచ్చరించడమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం కిందిస్థాయి అధికారులను హెచ్చరిస్తున్నారు. కానీ వీటినేమి పట్టించుకోకుండా రూరల్ పోలీసులు గతంలో లేని విధంగా సివిల్ కేసుల్ని నమోదు చేసి రికార్డు సృష్టిస్తున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆ ఇద్దరు నేతలు సూచిస్తే చాలు క్షణాల్లో కేసు నమోదు చేసి భూ యజమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్వయంగా బాదితులే చెబుతోన్నా మాట ఇది.
జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులున్నారనే విషయాన్నే మరచి ఇలా సివిల్ కేసులు నమోదు చేస్తుంటే ఆరికట్టే వారే లేరని బాదితులు బోరున విలపిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పీఎ అని చెప్పుకుంటున్న వ్యక్తి కూడా ఇతరులపై దాడి చేశారని విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
ఇలా ప్రజాపాలనలో దౌర్జన్యాలు ఎక్కువగా అవుతున్నాయని ప్రజలు లోలోపలనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం లోని నేతలు సమయానం పాటిస్తూ నియమ నిబంధనలను అమలు చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెబుతున్న మాట.
ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన వ్యవహారం
ఈ నేతల భూ దందాలు, సెటిల్మెంట్లు, వీటి కోసం వారు ప్రత్యేకంగా ఆఫీసులు ఏర్పాటు చేసుకొని చేస్తోన్నా వ్యవహారాలపై సీఎం వరకు పిర్యాదులు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే ెున్నంకు తలనొప్పిగా మారింది. ప్రజల పట్ల మచ్చలేని నేతగా రాణిస్తోన్నా ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు సొంత పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ఈ విషయమై ఇది వరకే ఎమ్మెల్యే వారివురిని హెచ్చరించినా వారి తీరులో మార్పు లేదని, వారిపట్ల కఠినంగా వ్యవహరించి అక్రమ భూ దందాలను ఆరికట్టి మాకు న్యాయం చెయ్యాలని బాదితులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలు చేయకూడదు
ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాలను చేయకూడదు. అక్రమ నిర్మాణాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ విషయంపై పలమార్లు చెప్పడం జరిగింది. నియమ నిబంధనలు పాటించి నిర్మాణాలు చేపడితే గృహ నిర్మాణదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిబంధనలను దూరం పెట్టి వారి ఇష్టం సారంగ వ్యవహరిస్తే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు ఉంటాయి.
ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్