26 March, 2026 | 3:07 AM

అమెరికాకు ఇరాన్ ప్రత్యేక కండీషన్లు

26-03-2026 01:27 AM
  1. గల్ఫ్‌లో బేస్‌లన్నీ మూసేయాలి

నష్టపరిహారం చెల్లించాలన్న ఇరాన్

తమ డిమాండ్ల జాబితాను పంపిన ఐఆర్‌జీసీ

టెహ్రాన్, మార్చి 25 : కాల్పులను ఆపే చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికా ముందు పెట్టింది. గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడి యా సంస్థ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనం లో వెల్లడించింది. ఇరాన్‌లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్‌జీసీ) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్న ట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇరాన్ కేవలం సైనిక స్థావరాల మూసివేతతోనే సరిపెట్టలే దు.

తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దా డుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. పశ్చిమాసియాలోని మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాలు పరోక్షంగా తమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటు న్నా యి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన డిమాండ్ల జాబితాను పంపింది.

అయితే, ఇరాన్ పెడుతున్న ఈ షరతులు ‘హాస్యాస్పదంగా, అవా స్తవికంగా’ ఉన్నాయని అమెరికా అధికారులు.. వాటిని కొట్టిపారేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఇరాన్ ఇంత కఠిన వైఖరితో ఉండటంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం గతంలో కంటే మరింత కష్టతరం కావచ్చని అరబ్, అమెరికా అధికారులు అభిప్రాయపడుతు న్నారు. ఇరాన్ డిమాండ్లతో చర్చలకు దిగుతుండటంతో దౌత్యపరమైన మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

ఇరాన్ ప్రధాన డిమాండ్లు ఇవే..

* గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి.

* మాపై జరిగిన దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి.

* వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిపై తమకు నియంత్రణ ఇవ్వాలి. సూయజ్ కెనాల్ తరహాలో ఈ మార్గం గుండా   వెళ్లే నౌకల నుంచి రుసుం వసూలు చేసే     అధికారం కల్పించాలి.

* భవిష్యత్తులో ఎలాంటి దాడులూ జరగవని హామీ ఇవ్వాలి.

* ఇరాన్ మిత్రపక్షమైన లెబనీస్ మిలీషియా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.

* తమపై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి.

* తమ క్షిపణి కార్యక్రమాన్ని పరిమితం చేసే ఎలాంటి చర్చలూ ఉండకూడదు.