28-06-2025 01:54:54 AM
సంగారెడ్డి, జూన్ 27(విజయక్రాంతి): జంట నగరాలకు తాగునీరందించే మంజీరా బరాజ్ ప్రమాదంలో పడిందంటూ రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ (ఎస్డీఎస్వో) నివేదిక అందిస్తే.. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మాత్రం డ్యామ్ భద్రమేనంటూ పేర్కొన్నారు. మరమ్మతుల కోసం రూ.3.5 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. మంజీరా డ్యామ్ భద్రతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డ్యామ్లో ఆప్రాన్ కొట్టుకుపోవడం, గేట్ల సీలింగ్ దెబ్బతినడంతో డ్యామ్ ప్రమాదంలో పడినట్టు ఎస్డీఎస్వో ఈ ఏడాది మార్చి 22న నివేదిక అందించింది. ఏండ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండి, జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 1965లో మంజీరానదిపై కల్పగూరు గ్రామ పరిధిలో మంజీర బరాజ్ను నిర్మించారు.
ప్రాజెక్ట్ కట్ట ఎత్తు 24 మీటర్లు (79 అడుగులు) కాగా, ఒక కిలోమీటర్ పొడువు ఉండి 4.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగిఉంది. ప్రత్యక్షంగా మూడు టీఎంసీల వరకు నీటి నిల్వ చేస్తారు. ఈ బరాజ్లో అత్యధిక నీటి ప్రవాహం, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడం, పర్యవేక్షణ లోపాలతో బరాజ్ మనుగడ ప్రమాదంలో పడిందని రాష్ట్ర ఆనకట్టల భద్రత సం స్థ పరిశీలనలో తేలింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పరిశీలించి నివేదిక అందించాలని కోరింది. అందులో భాగంగా ఈ ఏడాది మార్చి 22న జాతీయ ఆనకట్టల భద్రత చట్టం ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్వో ఆధ్వర్యంలో నిపుణుల బృందం బరాజ్ను పరిశీలించి నివేదికను సమర్పించింది. బరాజ్ నిర్వహణ పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించడమే కాకుండా తుమ్మ చెట్లు పెరిగిపోవ డంతో మట్టికట్ట బలహీనమైందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు స్పిల్ వేలో కొంత భాగం సైతం దెబ్బతిన్నదని నివేదికలో పేర్కొంది.
వరద ఉదృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతు చేయకపోతే అది క్రమంగా డ్యామ్ వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బరాజ్కు తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో బరాజ్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఏ మాత్రం శ్రేయస్కరం కాదని బృందం తేల్చిచెప్పింది.
మంజీరా డ్యామ్ సేఫ్: రాహుల్ బొజ్జ
మంజీరా డ్యామ్ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో రాహుల్ బొజ్జ మాట్లాడుతూ.. జంటనగరాలకు తాగునీరందించే మంజీరా డ్యామ్ సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.
డ్యామ్కు ఎలాంటి పగుళ్లు లేవన్నారు. మరమత్తుల కోసం రూ.3.5 కోట్లు కేటాయించామన్నా రు. సమావేశంలో ఆర్డీవో రవీంద రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ పటాన్ చెరువు డివిజన్ -2 జనరల్ మేనేజర్ మాణిక్యం, రాజంపేట్, కులబ్గూర్ డీజీఎం రామకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.