28-06-2025 01:54:45 AM
- ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి
- మెదక్ ఎంపీ రఘునందన్రావు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): హామీలను అమలు చేయడంలో వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు తదితర అంశాలను ముందుకు తెస్తూ కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాల వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 18 నెలలుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ పంచాయితీ వ్యవహారంలో సిట్ వేసి ఓ టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైందే దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనేనన్నారు.
అప్పుడు పోలీసులు తమ ఫోన్లు వింటున్నారని తాను అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, గాంధీ భవన్లో పని చేసేవారికి సిట్ నోటీసులు ఇస్తుందని, కానీ డీజీపీకి ఫిర్యాదు చేసిన తనకు మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రభాకర్రావును పట్టుకొచ్చినట్టు మిగతా వారిని పట్టుకుంటామని చెబుతున్నారు తప్పితే, విచారణ పూర్తి చేసే పరిస్థితి కనిపించడంలేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడినైన తనను వదిలేసి, పీసీసీ చీఫ్ను సిట్ పిలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే పంచాయితీ కోసమే ఈ తతంగం నడుస్తోందని మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్రావు వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.