ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
తాసీల్దార్ కు వినతి పత్రంలో తపస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి
ముత్తారం,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం ముత్తారం మండల తపస్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు ముదుగంటి సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంధం రమేష్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పీఆర్సీ అమలు, డీఏల విడుదల, ఈ-కుబేర్లో పేరుకుపోయిన బిల్లులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పెన్షనర్లకు బకాయి బిల్లులు చెల్లించడం, సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన గ్రాంట్లు వెంటనే విడుదల చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






