calender_icon.png 21 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలపై భారం మోపడం దారుణం

21-09-2025 12:22:38 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనం
  2. రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు
  3. కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలు క్షమించరు
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి) : రాష్ర్ట బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలు దారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేటీఆర్ స్పష్టం చేశారు.

హైడ్రా వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రహదారి భద్రతా సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రెండు నుంచి 10వేల వరకూ అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతికి చెందిన ప్రజానీకాన్ని దగా చేయడమే అవుతుందని మండిపడ్డారు.

రెండేళ్లు కావస్తున్నా ఇవ్వాల్సిన గ్యారెంటీలను గాలికొదిలేసి, చివరికి ప్రజల నుంచే ముక్కుపిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్రచేస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరని కేటీఆర్ హెచ్చరించారు. పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి మరీ వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలని ఆయన హితవు పలికారు.