22-06-2025 12:51:24 AM
- ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వాగ్మూలం
- ఒకేరోజు 650 ఫోన్ల ట్యాపింగ్పై సిట్ ముమ్మర దర్యాప్తు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు శనివారం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు 5 గంటల పాటు ప్రణీత్రా వును సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయిన ప్రణీత్ రావు.. సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్లిపోయారు.
2023, నవంబర్ 15న ఒకేరోజు 650 ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించిన కీలక సమాచారంపై సిట్ అధికారులు ప్రణీత్రావును ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు.. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఈ వ్యవహారంలో ఏ మేరకు ఉందనే కోణాల్లో విచారణ కొనసాగినట్టు సమాచారం. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రణీత్రావు సిట్ విచారణకు వ్యక్తిగతంగా హాజరవ్వడం ఇది మూడోసారి. గతంలో ఈ నెల 13, 18 తేదీల్లో ఆయన్ను సిట్ విచారించింది.
బాధితుల వాంగ్మూలాలు, ప్రభాకర్రావు వెల్లడించిన వివరాల నేపథ్యంలో ప్రణీత్రావును సిట్ మరోసారి ప్రశ్నించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సిట్ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. 2023, నవంబర్ 15న ఒకేరోజు 650 ఫోన్లను ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించింది. రాజకీయ నేతల ఫోన్ నెంబర్లను మావోయిస్టు నేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పంపించి, రివ్యూ కమిటీ ద్వారా గ్రీన్ సిగ్నల్ పొందిన తర్వాతే ట్యాపింగ్ చేసినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది.
ఈ వ్యవహారంలో ప్రభాకర్రావును కూడా సిట్ అధికారులు దాదాపు మూడుసార్లు విచారించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్రావును పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించారు. అప్పట్లో ప్రభాకర్రావు ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు ప్రణీత్రావు సిట్ ముందు అంగీకరించారు. శనివారం విచారణకు వ్యక్తిగతమైన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లతో హాజరు కావాలని సిట్ అధికారులు ప్రణీత్రావును ఆదేశించారు.
దీంతో ఆయన కొన్ని కీలక పత్రాలతో సిట్ ముందుకు వచ్చా రు. ప్రణీత్రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశా రు. ఈ కేసులో ఎవరిని విచారించినా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్టు గుర్తించారు. అధికారుల మధ్యే ఈ వ్యవహారం నడుస్తోందని, అయితే ట్యాపింగ్ చేయాలని ఆదేశాలిచ్చి న రాజకీయ నేతలు ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.