26-05-2025 06:37:47 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలో దొంగలు పడ్డారని, ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట నియోజకవర్గం, ఆత్మకూర్ మండలం ఏపూర్ గ్రామంలో పర్యటించి ఐకేపీ సెంటర్ లో తడిసి మొలకెత్తిన వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ముక్కి మొలకలు వస్తున్నాయని, 60 రోజులలైనా వడ్లు కొనలేదంటే ఇంతకన్నా దారుణముంటదా? అని అడిగారు. నీళ్లు రాక అరకొరగా పండిన పంట వడ్లను రైతులు ఐకేపీ కేంద్రాలకు తరలిస్తే వాటిని కూడా ప్రభుత్వం కొనకపోవడంతో ధాన్యం తడిసి మొలకళ్లొచ్చి పార్ బాయిల్డ్ వాసన వస్తున్నాయని మండిపడ్డారు.
ఐకేపీ కేంద్రాల్లోని రైతుల కష్ఠాలు ప్రభుత్వానికి పట్టవా? అని ప్రశ్నించారు. ఋతుపవనాలు వచ్చి దుక్కి దున్నాల్సిన రైతు, ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తుందన్నారు. వడ్లు కొనే దిక్కు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరని, కాంటాలైనాక మిల్లుల్లో రైతులతో బేరాసారాలు నడిపిస్తున్నారని విమర్శించారు. రెండు మూడు రోజులకోసారి వచ్చే లారీల కోసం పడిగాపులు గాస్తున్న రైతులు చివరికి దళారుల కాళ్ళు పట్టుకునే దుస్థితి దాపురించిందన్నారు. పంట పండించేందుకు కష్టపడ్డ రైతు, వడ్లు అమ్ముకునేందుకు మరింత కష్టపడుతున్నాడు.
అన్ని రంగాలతో పాటు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేసిందని, ఐకేపీ కేంద్రాల్లో గింజలేకుండా ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు రేవంత్ కీలుబొమ్మల ఆడుతుండడంతో నదులు మళ్ళీ దోపిడీకి గురవుతున్నాయని విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేసుల భయంతో మోడీ కాళ్ళు మొక్కే పనిలో ఉన్నాడని, తెలంగాణ సంపదను ఆంధ్రకు దోచిపెట్టే కుట్ర జరుగుతుందని, కృష్ణా నది దోపిడీ అయిపొయిందన్నారు. బనకచర్లతో గోదారి దోపిడీకి మరో కుట్ర జరుగుతుందని జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
బనకచర్ల ద్వారా గోదావరి జలాలు దోపిడీ జరుగుతున్నా రేవంత్ మొద్దు నిద్ర పోతున్నాడని, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణా నీటిని దోపిడీ చేస్తున్నాయన్నారు. కేసుల కోసం సీఎం మోడీ కాళ్ళు పట్టుకుంటే మంత్రులు చంద్రబాబుతో ఫైరవీలు చేస్తున్నారు. మంత్రులు కమిషన్ల పనిలో ఉంటే ఏపీ సీఎం తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నాడని వివరించారు. కండ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం.. కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మన నీళ్లు మనకు వాడలేని నీచ స్థితిలో ఇక్కడి మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేతకాని స్థితిలో ఉన్నారు. పాలన చేతకాక పోతే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.