20-06-2025 12:00:57 AM
క్యాన్సర్ రోగికి 10 లక్షల సాయం
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా క్యాన్సర్ బాధితుడు హరికృష్ణప్రసాద్కు వైద్యం కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణప్రసాద్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. హరిప్రాసాద్ది పేద కుటుంబం. గురుకుల పాఠశాలల్లో రూ.13 వేల వేతనంతో చిరుద్యోగిగా హరికృష్ణ ప్రసాద్ పని చేస్తున్నాడు.
అతనికి భార్య శైలజ, ఎల్కేజీ, ఒకటో తరగతి చదువుతున్న పాప, బాబు ఉన్నారు. మూడు నెలల క్రితం క్యాన్సన్ బారిన పడిన హరికృష్ణ ప్రసాద్ ఇప్పటికే వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి వైద్యం కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. హరికృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఇప్పటి వరకు చికిత్స కోసం ఖర్చు చేసిన డబ్బులను సీఎం రీలిఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా చూస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. జగ్గారెడ్డి సాయం చేయడంతో హరికృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.