23-06-2025 11:41:43 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఒలింపిక్ డే రన్(Olympic Day Run) కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్(Additional Collector Kishore Kumar) పాల్గొని, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు, అక్కడి నుంచి తిరిగి స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది.
ఒలింపిక్ డేను పురస్కరించుకొని నిర్వహించిన ఈ రన్లో విద్యార్థులు, క్రీడాకారులు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన ఇచ్చారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో క్రీడలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎసిజిఈ పరమేశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, పెటా ప్రెసిడెంట్ భూక్యా రమేష్, సెక్రటరీ భోజన్న, ఎంఈఓ నాగేశ్వర్ రావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.