calender_icon.png 27 January, 2026 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరుమర్తి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

27-01-2026 05:29:14 PM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే

చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ షబానా అజీముద్దీన్ మరియు ఆ పార్టీకి చెందిన యాభై కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పట్టణ కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి, సంక్షేమం కుంటునపడ్డాయని, డైవర్షన్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. మార్పు మార్పు అంటూ నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిదని, కాంగ్రెస్ పార్టీ మోసాలకు బలైపోయామని ఇప్పుడు ప్రజలందరూ బాధపడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాలను ఇవ్వకపోవడమే గాక ఉన్న పథకాలను రద్దు చేసి పేదోల్ల పొట్టకొడుతుందని మండిపడ్డారు.

ముందు చూపుతో బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, బాలింతలకు ఆసరా ఇచ్చిన కేసిఆర్ కిట్ పథకాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి ఆపేశారని, సన్నబియ్యం అనే పథకం గతంలో కేసీఆర్ తెచ్చినదే అని, ఈ దేశంలో గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. చదువుకున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాకా దాని ఊసేలేకుండా చేశారు.

తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ పండుగకి కేసిఆర్ అందించిన బతుకమ్మ చీరలను పేరుమార్చి ఇందిరమ్మ చీరలంటూ ఎన్నికల సమయంలో పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డల, రైతన్నల శాపనార్థాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు భద్రత, రక్షణ కరువైందని, ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నాయకులు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని తెలిపారు. వారికి ఎన్నికలలో ఓట్లు, సీట్లు తప్పా  పేదప్రజల కష్టాలు, బాధలు  పట్టవని, బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పట్టణ ప్రజలను  ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.