7 July, 2026 | 7:14 PM

పోడు రైతులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

07-07-2026 06:38 PM

పోడు రైతులతో కలసి కలెక్టరేట్ ఎదుటధర్నా

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామ శివారులో అటవీ శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ట్రెంచ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బాధిత రైతులతో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను తమకే తిరిగి ఇవ్వాలని పోడు రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ... వర్షాకాలం వచ్చిన తర్వాత రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసిన సమయంలో అటవీ అధికారులు వచ్చి సాగు భూముల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు. 40–50 ఏళ్లుగా సాగులో ఉన్న భూములను ఇప్పుడు అటవీ భూముల పేరుతో లాక్కోవడం సరైంది కాదని, ఈ ఏడాది రైతులకు సాగు అవకాశం ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాది రెవెన్యూ–ఫారెస్ట్ జాయింట్ సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.