21 May, 2026 | 4:09 AM

జీవో 46 బాధితులకు న్యాయం చేయాలి

19-06-2024 01:01 AM

సచివాలయం వద్ద నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 బాధితులకు న్యా యం చేయాలని బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరపాలని కోరారు. బాధి తుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చేందుకు మంగళవారం సచివాలయానికి వెళితే పోలీసులు అనుమతిం చలేదు. దీంతో సచివాలయం గేటు బయటే వినతిపత్రంతో నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వా నికి పీఆర్ స్టంట్ మీద ఉన్న సోయి ప్రజా సమస్యలపై లేదన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. 60 మార్కులు ఉన్న వారికి ఉద్యోగం వచ్చిందని, కానీ 90 మార్కులు వచ్చిన వారికి రాలేదని, జీవో 46 బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. బాధితుల పక్షాన సీఎస్‌ను కలిసేందుకు వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని, 10 రోజులుగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వానికి చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటేనని, అందుకే వినతిపత్రం సచివాలయ గోడకు అంటించి నిరసన తెలిపమన్నారు. తాను చట్టసభల్లో లేకున్నా జన సభల్లో ఉంటానన్నారు.