కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ లోనే ఉన్నా.. ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నా
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Speaker Gaddam Prasad) బుధవారం నాడు డిస్మిస్ చేశారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని కడియం వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు.
కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఎన్నడూ ప్రజలముందుకు వచ్చి ఫిరాయింపుల గురించి మాట్లాడలేదని సూచించారు. సభలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను వ్యవహరించలేదని కడియం పేర్కొన్నారు. ''మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం.. ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నాం'' అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకున్నారు. గతంలో ఎంత మంది ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెబితే పదవికి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. అనర్హత పిటిషన్ చట్టబద్ధం కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకు అనర్హత పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు.




