04-02-2026 01:32:31 AM
మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ప్రారంభించిన కామినేని ఆసుపత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాల ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉద్దేశంతో కామినేని ఆసుపత్రి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు ప్రజలు 040-6905 9100 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే, క్యాన్సర్ ప్రమాదంపై నిపుణుల ఉచిత సంప్రదింపులు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఈ క్యాంపెయిన్ కాలంలో వైద్యులు సూచించిన నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ కూడా అందించనున్నట్లు కామినేని ఆసుపత్రి ప్రకటించింది. కామినేని ఆసుపత్రి జన్యు, మాలిక్యులర్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, విభాగాధిపతి డా. అనీ క్యూ హసన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ.. “కుటుంబ చరిత్ర అనేది వారసత్వ క్యాన్సర్ ప్రమాదానికి తొలి హెచ్చరిక. జన్యు కౌన్సెలింగ్ ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, సమయానికి పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి” అని అన్నారు.