11-06-2025 12:50:23 AM
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే చివరి వ్యక్తి అయ్యే అవ కాశం కూడా కనిపిస్తోంది.
ఈ నేపథ్యం లో కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏం ప్రశ్నిస్తుంది? ఆయన ఏం సమాధానాలు ఇస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11:30గంటలకు కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయనను ఇన్కెమెరా సమక్షంలో విచారిస్తారని ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు తరలిరావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదివరకే మాజీమంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాగా, కేసీఆర్ 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్నారు.
కేసీఆర్ విచారణ తర్వాత కమిషన్ నివేదిక..
గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీశ్రావును ఆర్థిక, సాంకేతిక అంశాలపై కమిషన్ విచారించింది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై కేసీఆర్ పకడ్బందీగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 114 మందిని విచారించింది. సుమారు 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలలో కొనసాగిన మాజీ సీఎస్ సోమేశ్కుమార్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, రజత్కుమార్, రామకృష్ణారావు సహా అనేక మంది అధికారులను, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, సీఈలను బహిరంగ విచారణకు పిలిచింది.
పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల రంగ నిపుణులు సైతం విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకం పూర్తి కానుంది. తర్వాత ఈ నెలాఖరు లోపు కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేసీఆర్కు సంఘీభావంగా..
కేసీఆర్ వరంగల్ రజతోత్సవ సభ తర్వాత తిరిగి ప్రజల్లోకి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఆయన రాక సందర్భంగా పార్టీ తరుఫున కేసీఆర్కు మద్దతుగా భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ అగ్రనేతలు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫాంహౌజ్ నుంచి బీఆర్కే భవన్ వరకూ కేసీఆర్తో పాటు ర్యాలీగా తరలి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
గ్రేటర్ పరిధితో పాటు గ్రేటర్ పరిసర ప్రాంతాల నుంచి కార్యకర్తలు వస్తారని గులాబీ వర్గాలు చెప్తున్నాయి. కారు పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, కవిత అంశం, విచారణ కమిషన్ ముందు హరీశ్రావు హజరు ఇప్పుడు పార్టీ అధినేత హాజరు అంశం గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉండటంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం సడలకుండా వారిలో ఆత్మస్థుర్యైం నింపేందుకు అధిష్ఠానం ప్రయత్నం చేస్తోంది.
విచారణకు ముందు ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. ఫాంహౌజ్లో ఉదయమే కేసీఆర్ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే హరీశ్రావుతో పలుసార్లు కేసీఆర్ తన ఫాంహౌజ్లో చర్చలు జరిపారు. సోమవారం హరీశ్రావు కమిషన్ ముందు విచారణ ముగియగానే నేరుగా కేసీఆర్ను కలిశారు.
కమిషన్ సంధించిన ప్రశ్నలు, విచారణ జరిగిన తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సోమవారమే సీనియర్ నేతలతో భేటీ అవుదామని భావించిన గులాబీ అధినేత ఆ భేటీని మంగళవారం ఉదయం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీనియర్ నేతలతో రాజకీయపరమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.