16-05-2025 01:36:00 AM
- సీఎంను ఎలాగూ చేయలేదు.. పార్టీ అధ్యక్షుడినైనా చేయండి
- కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానంటూ హరీశ్రావు చెప్పడంలో అర్థం లేదు
- కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ లేదా ఇంకెవరి పేరైనా చెబితే బాగుండేది
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్.. పదేళ్లు అధికారంలో ఉండి ఆ పని చేయలేదని, కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత పదవైనా ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదని, ఇప్పుడు దళితులకు నాయకత్వమిచ్చి, వారికి ఆ కుటుంబం విధేయతగా ఉండాలన్నారు. మీడియాతో సీఎం రేవంత్రెడ్డి చిట్చాట్లో మాట్లాడుతూ.. మాజీమంత్రి హరీశ్రావు, కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తానని చెప్పడంలో అర్థంలేదన్నారు. ఆ స్థానంలో బిల్లా అయితే ఏంటీ? రంగా అయితే ఏంటీ? అని విమర్శించారు.
వాళ్ల కుటుంబంలో ఎవరి నాయకత్వమయితే తేడా ఏమిటని సీఎం ప్రశ్నించారు. కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ఇంకా ఎవరి నాయకత్వంలోనైనా పని చేస్తానని హరీశ్రావు చెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగానైనా నియమించాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత సామాజికవర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. తాము ఖర్గేను గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవిస్తామని చెప్పారు.