16-05-2025 01:35:08 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న తప్పిదాలకు అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితులున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గురువారం ఎక్స్లో ఆయన పోస్టు చేశారు.
ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న అడ్వకేట్ను హెచ్చరించిన సుప్రీంకోర్టు, కంచ గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా? అని హెచ్చ రించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
వీటికి తాను బాధ్యుడిని కాదని రేవంత్రెడ్డి తప్పించుకునే అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై, కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సీఎం చేసిన తప్పులను ఒప్పుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవన్నారు. కంచ గచ్చిబౌలి భూములను అమ్మి పదివేల కోట్ల రూపాయల స్కాం చేయడం ముమ్మాటికీ అవినీతి, నమ్మకద్రోహమే అని కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్రెడ్డి బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను ప్రభుత్వమే కాపాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన పదివేల కోట్ల స్కాంకు బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.