calender_icon.png 15 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగంలోకి కేసీఆర్

15-12-2025 01:52:23 AM

  1. 19న తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం
  2. సాగునీటి ప్రాజెక్టులు, తదుపరి ప్రజా ఉద్యమాలపై చర్చ
  3. కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం దేబరించడం బాధాకరమనే వ్యాఖ్యలు 
  4. రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అవుతుందని అభిప్రాయం
  5. తెలంగాణకు మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం
  6. ఉద్యమ స్వరూపానికి శ్రీకారం చుట్టేలా కేసీఆర్ సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఎప్పటికప్పుడు ఆయా రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తున్న కేసీఆర్ స్వయంగా తెలంగాణ భవన్‌కు రానుండటంతో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి బీఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది.

కేసీఆర్ అధ్యక్షతన డిసెంబర్ 19వ తేదీన బీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం కానుంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనుంది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బీఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడుతోంది. రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లడం రాష్ర్ట రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని బీఆర్‌ఎస్ భావిస్తోంది.

రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడడం లేదని వ్యాఖ్యానిస్తోంది. బీజేపీ.. తెలంగాణ ప్రయోజనాలను గండి కొడుతున్నట్లుగా ఉందని స్పష్టమవుతున్నదని బీఆర్‌ఎస్ చెబుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కాదు.. కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ర్ట జల దోపిడీకి సహకరిస్తున్న బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని కేసీఆర్ భావిస్తున్నారు.

మూడోసారి అధికారంలోకి వస్తే... 

2023 ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈ పాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందడం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనాలు అందేవని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. కానీ ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు జిల్లాల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పుల్లంత పని కూడా చేయలేక పోవడంతో ఆ ప్రాంత ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ఈ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు గడిచినా, తెలంగాణ రాష్ర్ట రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుండడంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలకూడదని ఆ పార్టీ అభిప్రాయపడుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాల్లో కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడం అనేది ఘోరమని అభివర్ణించింది. సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్‌ఎస్ రాజీ పడబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ కీలక అంశాలపై కూలంకుషంగా చర్చ జరగనుంది. అలాగే అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంతోపాటు ఆంధ్ర జల దోపిడీపై పోరాడేందుకు..ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నారు.

పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పేరు మార్చి నల్లమల సాగర్‌ప్రాజెక్ట్‌గా ఏపీ ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేపట్టిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖ సైతం వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల నీటి హక్కులపై పోరు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.