28-06-2025 12:22:44 AM
నల్లగొండ టౌన్, జూన్ 27: కాంగ్రెస్ పార్టీలో కింగ్ బ్రాండ్ గా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న ఆయన రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన నల్లగొండ నుండి అనేకమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అక్కడి నుండిపోటీ చేయడం లేదని తెలుస్తోంది.
ఆయన మరో నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఆలోచనలో ఉన్నాడని వినికిడి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అందుకే ఆయన నకిరేకల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది.
రాష్ట్ర విభజన చట్టం జనాభా ప్రకారం నల్లగొండ ఉమ్మడి జిల్లాలో మూడు నుంచి నాలుగు కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. డి లిమిటేషన్ ప్రకారంగా నకిరేకల్ నియోజకవర్గం జనరల్ గా మారే ఛాన్సు ఉంది.
వెంకట్ రెడ్డి నకిరేకల్ పై ఫోకస్..ఘ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1999లో నల్లగొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. 2004, 2009, 2014 లో వరుసగా గెలుపొంది అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించారు.
2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి మరోసారి విజయం సాధించి కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇంతటి అనుబంధం ఉన్న జిల్లా నుంచి కాకుండా నకిరేకల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాడని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గం 2009 ముందు జనరల్ గా ఉండగా 2009 తర్వాత ఎస్సీ రిజర్వు అయింది.
డి లిమిటేషన్ కారణంగా ఈ నియోజకవర్గం జనరల్ అయ్యే ఛాన్స్ ఉందని పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం నకరేకల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు రామన్నపేట చిట్యాలను కొత్తగా ఏర్పడే చౌటుప్పల్ నియోజకవర్గంలోకి కలిపే అవకాశం ఉంది.
పక్కనే ఉన్న కొన్ని మండలాలను నకిరేకల్ కలిపి జనరల్ నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత నకిరేకల్ నియోజకవర్గం లో మంత్రి సొంతూరు బ్రాహ్మణ వెల్లంల ఉండడంతో ఆయన అక్కడి నుండే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇంతకుముందు నాన్ లోకల్ లో పోటీ చేసిన వెంకట్ రెడ్డి సంతూర్ లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
డైలమాలో వేముల వీరేశం...
నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో వేముల వీరేశం రెండవసారి శాసన సభ్యునిగా కొనసాగుతున్నారు. డి లిమిటేషన్ కారణంగా ఈ నియోజకవర్గం జనరల్ గా మారే అవకాశం ఉంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది. నకిరేకల్ నియోజకవర్గం జనరల్ అయితే ప్రస్తుత శాసనసభ్యులు వేముల వీరేశం వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని డైలామా లో ఉంది.
చౌటుప్పల్ పై రాజగోపాల్ రెడ్డి ఫోకస్..
ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి వైఎస్సార్ ఆశిస్సులతో 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజనతో జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ భువనగిరి ఎంపీగానే పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత నల్గొండ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలిచారు.
2022లో బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు మళ్లీ సొంతగూటికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా రెండోసారి విక్టరీ కొట్టారు. ఈయన వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్ కొత్త నియోజకవర్గంగా ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలతో పాటు భువనగిరి అసెంబ్లీ పరిధిలోని పోచంపల్లి, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాలతో కలిసి కొత్త నియోజకవర్గం ఉంటుందని తెలుస్తోంది.
ఈ మండలాలలో కలిసి చౌటుప్పల్ నియోజకవర్గం ఉండేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన మునుగోడును వదిలేసి చౌటుప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఈ ఐదు మండలాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉంది.
చౌటుప్పల్ నుంచి కోమటిరెడ్డి పోటీ చేస్తే ఆయన తిరుగే ఉండదనే టాక్ కూడా వస్తోంది. అందుకే కొన్ని రోజులుగా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలపైనే రాజగోపాల్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని వినికిడి.