28-06-2025 12:22:31 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, జూన్ 27 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రజల కోసం మూడు ఎకరాల విస్తీర్ణంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కమ్యూనిటీల కోసం రూ .కోటి 71 లక్షల అంచనా వ్యయంతో స్మశాన వాటికలు నిర్మించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకువాస్తామన్నారు. శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్మశాన వాటిక పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండ్లగూడ ప్రజలకు స్మశాన వాటిక కోసం తరచూ ఇబ్బందులు ఏర్పడుతుండడంతో శాశ్వత ప్రాతిపదికన మూడు ఎకరాలను కేటాయించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించిన నిధులతో పాటు రూ.20 లక్షల సొంత నిధులు స్మశాన వాటిక అభివృద్ధి కోసం వెచ్చించినట్లు తెలిపారు.
ప్రతి మతానికి ఎకరా చొప్పున స్థలం కేటాయించి అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, ఈఈ సురేష్ కుమార్, డిఈ నరేందర్, ఏ ఈ శివ కుమార్, కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పూరి జగన్నాథుడి రథయాత్ర...
పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని జగన్నాథుడి దేవాలయాన్ని, బొల్లారంలోని జగన్నాథ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్నాపూర్ ఆలయంలో అన్న ప్రసాద వితరణ కోసం లక్ష రూపాయల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.