కీటెక్స్ ఉత్పత్తి ప్రారంభంపై కేటీఆర్ హర్షం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ కీటెక్స్ వరంగంల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కొత్త యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ఒక చారిత్రాత్మక ఘట్టమని మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతన్న క్లిష్ట సమయంలో కీటెక్స్ అధినేత సాబు జాకబ్తో జరిపిన వాట్సప్ చర్చలు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. కేరళ నుంచి కీటెక్స్ను తెలంగాణకు రప్పించడానికి చేసిన ప్రయత్నమంతా ఇంకా తన కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. కీటెక్స్తో తెలంగాణ యువతకు వందలాది ఉద్యోగాలు వస్తాయన్న తన నమ్మకం వృథా కాలేదన్నారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభంచడంపై కీటెక్స్ యజమన్యానికి, ఉద్యోగులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.






