28-05-2025 01:03:06 AM
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. యూకే, అమెరికాలో జరిగే ఆయా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి మంగళవారం బయలుదేరిన కేటీఆర్.. లండన్ చేరుకోగా, అక్కడ ఆయనకు తెలంగాణ ఎన్నారైలు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో వెల్కమ్ కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ను ఏర్పాటు చేశారు.
కాగా బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్లో జరిగే ఇండియా వీక్న ప్రోగ్రామ్లో కేటీఆర్ పాల్గొని ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, తెలంగాణ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరిస్తారు. ప్రొగ్రామాటిక్ డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ నాలెడ్జ్ సెంటర్ను అదేరోజు వార్విక్లో కేటీఆర్ ప్రారంభిస్తారు.
ఆ తర్వాత కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. యూఎస్లో తెలంగాణ ఎన్నారైల ఆధ్వర్యంలో జరిగే ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ (యూటీ డల్లాస్)లోని భారతీయ విద్యార్థులను జూన్ 2న కేటీఆర్ కలుస్తారు.
ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కేటీఆర్
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణభవన్లో జూన్ 2న శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెం డాను, పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఈ వేడుకల్లో సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో కోరారు. జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాతో పాటు, పార్టీ జెండాలను ఎగరేసి సంబురాలు జరపాలన్నారు.