calender_icon.png 7 June, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనులు చూపాలని కూలీల నిరసన

05-06-2025 09:16:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ పట్టణంలో నిరుపేదలు, కూలీలు తమకు ఉపాధి చూపాలంటూ గురువారం మున్సిపాలిటీ కార్యాలయానికి తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ... మరిపెడను మున్సిపాలిటీగా ప్రకటించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం లేదని ఆరోపించారు. ప్రతి ఏడాది 20 రోజులు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉండి పనులకు వెళ్లిన వారికి ఏడాదికి 12 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కనీసం ఆ పథకాన్ని అయినా తమకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణం పేరుతో తమకు ఉపాధి చూపకపోవడంతో వందలాది మంది కుటుంబాల జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పల్లెల్లో ఉండే పేదలకు ఉపాధి కల్పించిన విధంగానే తమకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. అనేక పర్యాయాలు తమకు ఉపాధి అవకాశాలు చూపాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ పేదలు, కూలీలు హెచ్చరించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.