3.33 లక్షల కోట్లు ఆవిరి
పడిపోయిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ కొత్త టారిఫ్ల ఎఫెక్ట్
ముంబై, ఫిబ్రవరి ౨౪: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న కొత్త సుంకాలు మదుపర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ.3.33 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మొదలవుతుందనే ఆందోళనల నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ కూడా 288 పాయింట్లు నష్టపోయి 25,425 పాయింట్లకు పడిపోయింది. ఫలితంగా టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి అగ్రశ్రేణి సంస్థల షేర్లు 6 శాతం వరకు పడిపోయాయి. దీంతో ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు నష్టపోయారు. బ్యాంకింగ్ రంగంలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు సైతం నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఐటీ రంగంలో అస్థిరత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.




