25-06-2025 01:50:09 AM
-కేసును ఛేదించిన పోలీసులు
- బంగారం విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా
- 18 మంది అరెస్టు, బంగారంతో సహా నగదు స్వాధీనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): తక్కువ ధరకు బంగారం విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న దొంగల ముఠాను పట్టుకున్నామని డీసీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారం తెలిపారు. బోయిన్పల్లికి చెందిన శ్రీ హరిరామ్ అనే వ్యక్తిని ఎస్వోటీ పోలీసులమంటూ బెదిరించి రూ.43 లక్షలు దోచుకెళ్లారు.
హరిరామ్ ఫిర్యాదులో పోలీసులు దర్యాప్తు చేపట్టి 18 మంది నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం హరిరామ్ వద్దకు రాధేశ్యామ్ అనే వ్యక్తి వచ్చి మార్కెట్ ధర కంటే 5శాతం తక్కువకు బంగారం అమ్ముతానని చెప్పాడు. తొలుత ఐదుగురు అపరిచితులను పరిచయం చేశాడు. ఆ తర్వాత రాధేశ్యామ్, రాంబాబు అనే వ్యక్తితో వచ్చి హరిరామ్ వద్ద ఉన్న నగదును తనిఖీ చేశారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు రాచకొండ ఎస్ఓటీ అధికారులమంటూ నటి స్తూ.. వారిలో ఒకరైన కేశవులు తన గుర్తింపు కార్డు చూపించి హరిరామ్పై దాడికి పాల్పడ్డాడు.
నగదు బ్యాగ్తో పాటు ఫోన్లు తీసుకుని పారిపోయారు. హరిరామ్ ఫిర్యాదుతో నిందితులు చంద్ర శేఖర్వర్మ, నాగరాజు కుమార్ వర్మలతో పాటు పోలీసు కానిస్టేబుల్ మీసాల కేశవులు సహా మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం అని డీసీపీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.43.21 లక్షల నగదు, 57.193 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలు, 23 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.