రిజిస్ట్రేషన్లు తగ్గినా.. పెరిగిన ఆదాయం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 2023 మొదటి నాలుగు నెలలతో పోల్చితే 2024 మొదటి నాలుగు నెలలో 22,142 డాక్యుమెంట్లు తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే రియల్ ఆదాయం 2023తో పోల్చితే సుమారు 260.22 కోట్లు పెరిగింది. అలాగే 2022 వార్షిక సంవత్సరంలో మొత్తం 12,07,065 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, తద్వారా రూ.10,669.46 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 2023 వార్షిక సంవత్సరంలో 12,01,899 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగగా, తద్వారా రూ. 11,275.17 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 5,166 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఆదాయం మాత్రం గత ఏడాదితో పోల్చితే రూ.605.71 కోట్ల ఆదాయం పెరిగింది. ఆదాయం పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తగ్గడం రియాల్టర్లను ఆందోళన కలిగించే అంశం.







