20-05-2025 12:00:00 AM
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేత
లక్షెట్టిపేట, మే 19: కోయపోచ గూడెంను పోడు లిస్టులో చేర్చి హక్కు పత్రాలు ఇవ్వాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ డిమాండ్ చేశారు. సోమ వారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కనికరపు అశోక్, దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ...
మాకులపేట గ్రామపంచాయతీ పరిధిలోని కోయపోచ గూడెంలో ఆదివాసి గిరిజన పేదలు 2002 నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఈ గ్రామాన్ని కూడా పోడు లిస్టులో చేర్చలేదన్నారు. దీంతో ఆదివాసి గిరిజన పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గిరిజన పేదలు సాగు చేసుకున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు.
బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని, రోడ్లు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. ఆదివాసి గిరిజన పేదలకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజలింగు, ఎల్లయ్య, రమేష్, మహేశ్వరి, తార, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శులు, బాపు, పోసవ్వ, పోషం, కోయ పోచంగూడెం ఆదివాసి గిరిజన పేదలు తదితరులు పాల్గొన్నారు.