calender_icon.png 30 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనంలోకి వెళ్దాం..11 ఏళ్ల పాలనను వివరిద్దాం

29-05-2025 12:36:13 AM

- ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి):  ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన విజయవంతంగా సాగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి వెళ్లి వివరిద్దామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీకి చక్కని అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

విదేశీ విజయాలు, పాకిస్తాన్‌పై పైచేయి, ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సహా అనేక విజయాలను ప్రజలకు చేరవేసేలా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ 11 ఏళ్ల పాలనపై రాష్ట్రంలో చేపట్టబోయే అనేక కార్యక్రమాలపై హైదరాబాద్‌లో త్వరలో కార్యశాల నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ కార్యశాలకు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులంతా తప్పకుండా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. కార్యశాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళిక రచించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మంచి అవకాశాలు ఉంటాయని, ఇందుకు తొలిమెట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.