02-06-2025 12:45:26 AM
నల్లగొండ టౌన్, జూన్ 1( విజయక్రాంతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి పిలుపునిచ్చారు. ఆదివారం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతాను టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి నల్లగొండ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించారు.
ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు , ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2 పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని అన్నారు.
సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని, మన ఊరు - మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలిపారు. ఈ ప్రచార జాతాలో ఎస్ ఓ కత్తుల రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఎం .రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస్ చారి, పెరుమాళ్ళ వెంకటేశం,
రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జి అరుణ, సరళ, వి .జగదీష్ బాబు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బద్రీనాథ్, మంగ్ల నాయక్, జిల్లా కార్యదర్శిలు గేరా నరసింహ, నల్లపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర సైదులు, ఎం . మురలయ్య, కె .మధుసూదన్, ఎర్ర నాగుల సైదులు, జానకి, సంధ్యారాణి, రవి, లక్ష్మీనారాయణ, రమణ, కృష్ణ, సయ్యదుద్దీన్, రాములు రాజశేఖర్ రెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.