విటమిన్ ‘సీ’పై అవగాహన కల్పిందాం
మన దేశంలో ప్రతి ఏడాది ఏప్రిల్ 4న విటమిన్ ‘సీ’ దినోత్సవంను జరుపుకుంటారు. ఈ రోజు మన ఆరోగ్యానికి విటమిన్ ‘సీ’ ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటైంది. ఆధునిక జీవనశైలిలో పోషకాహార లోపాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో విటమిన్ ‘సీ’ ప్రాధాన్యతను గుర్తుచేసే అవసరం మరింత పెరిగింది. విటమిన్ ‘సీ’ను అస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని రక్షించడంలో విటమిన్ ‘సీ’ సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది ఉపయోగం. విటమిన్ ‘సీ’ దినోత్సవం సంధర్బంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి మన ప్రభుత్వాలు పాఠశాలలు, కళాశాలలు, ఆరోగ్య సంస్థలు ఈ రోజున ప్రత్యేక సదస్సులు, ప్రచార కార్యక్రమాలు చేపడతాయి. విటమిన్ ‘సీ’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలలో నిమ్మకాయ, నారింజ, మోసంబి, ఉసిరికాయ, టమోటా, క్యాప్సికమ్ వంటి పండ్లు, కూరగాయలు ఉన్నాయి.
ముఖ్యంగా ఉసిరికాయలో విటమిన్ ‘సీ’ సమృద్ధిగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ‘సీ’ లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వల్ల దంతాలు బలహీనపడటం, దేహంలో నిస్సత్తువ, చర్మ సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. మొత్తానికి విటమిన్ ‘సీ’ మనకు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో విటమిన్ ‘సీ’ ఉన్న పదార్థాలను చేర్చుకుని ఆరోగ్యంగా జీవించాలి.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్




