పురమంతా వెలుగులు.. అంబేద్కర్ సెంటర్లో చీకట్లు!?
కేసముద్రం, మార్చి 8 (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ప్రతి విద్యుత్ స్తంభానికి కొత్తగా వీధిలైట్లు ఏర్పాటు చేయించారు. దీనితో పట్టణం రాత్రి పూట దేదీప్య ప్రమాణంగా వెలుగులు విరజిమ్ముతూ అత్యంత కాంతి వంతంగా మారిపోయింది. అయితే పట్టణంలోని ప్రధాన కూడలిగా ఉన్న అంబేద్కర్ సెంటర్ లో వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడం, గతంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలు పాడై పోవడం వల్ల అంధకారంలో మగ్గిపోతుంది.
అంబేద్కర్ సెంటర్లో వీధిలైట్లు లేకపోవడం వల్ల సమీపంలోని రైల్వే స్టేషన్ నుండి రాత్రిపూట రైలు దిగిన ప్రయాణికులు చీకటి లో అంబేద్కర్ సెంటర్ వరకు రావడానికి సెల్ఫోన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసముద్రం పట్టణంలో వీధిలైట్లు ఏర్పాటు చేసిన అధికారులు, అంబేద్కర్ సెంటర్ వద్ద వీధిలైట్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే అంబేద్కర్ సెంటర్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుకున్నారు.




