calender_icon.png 30 May, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపాలమిత్రల గోడు వినరూ!

30-05-2025 12:41:39 AM

  1. గోపాలమిత్రలకు వేతనాలు అందక ఇబ్బందులు 
  2. తొమ్మిది నెలలుగా ఇదే దుస్థితి 
  3. ఉమ్మడి మెదక్ జిల్లాలో 161 మంది గోపాలమిత్రలు 

సంగారెడ్డి, మే 29(విజయక్రాంతి):: మారుమూల పల్లెలు.. పశువైద్య శాలలు అందుబాటులో లేని పల్లెల్లో పాడి రైతుల ఇంటి ముంగిట్లో అత్యవసర సేవలు అందిస్తూ.. పశువులకు సంబంధించిన సీజనల్ వ్యాధులపై వాటి యజమానులను అప్రమత్తం చేస్తూ.. పశువులకు అత్యవసర చికిత్సలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు గోపాల మిత్రలు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారింది.

తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నిత్యం గ్రామాలను తిరుగుతూ క్షేత్రస్థాయిలో పాడి రైతులకు సేవలందించడంతో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్లో సైతం గోపాలమిత్రలు భాగస్వామ్యం అవుతున్నారు. కానీ వీరి గోడు మాత్రం ఎవరూ వినడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు..

తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 161 మంది గోపాలమిత్రలు ఉన్నారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 46, మెదక్ జిల్లాలో 48, సిద్దిపేట జిల్లాలో 67 మంది ఉన్నారు. వీరంతా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా నెట్టుకొస్తున్నారు. వ్యవసాయ అనుబంధంగా పాడి రంగంలో మేలు జాతి ఆవులు, గేదెల పునరుత్పత్తి, పాల ఉత్పత్తి, ఉత్పాదక పెంపు లక్ష్యంగా గోపాలమిత్ర వ్యవస్థ ఏర్పాటైంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో  జిల్లాలో సుమారు 6.50 లక్షలకు పైగా పశువులు ఉండగా 161 మంది గోపాలమిత్రలు సేవలు అందిస్తున్నారు. పశువులకు కృతిమ గర్భధారణ చేయడంతో పాటు మేకలు, గొర్రెలకు వీరు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. అలాగే పశువులకు టీకాలు, నట్టలు, గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడంలో గోపాలమిత్రల పాత్ర కీలకం. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.11,050 చెల్లిస్తున్నారు. 

లక్ష్యాన్ని చేరుకోలేదంటూ.. 

పశువుల సంఖ్య మేరకు గోపాలమిత్రలకు కృతిమ గర్భధారణ లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఒక్కో గోపాలమిత్ర నెలకు 100 పశువులకు కృతిమ గర్భధారణ చేయాలి. కానీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాడి రైతులు సహజ గర్భధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇదే కారణం చూపుతూ అధికారులు గోపాలమిత్రల వేతనాల్లో కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలే అంతంత మాత్రంగా వచ్చే వేతనాల్లో.. కోత విధించడంతో మేం ఎలా బతికేది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నెలనెలా  వేతనాలు చెల్లించక పోవడంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు.

ఈ విషయంపై పలువురు గోపాలమిత్రలు తమ ఇబ్బందులను నాయకులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా వేతనాలు విడుదల చేసేలా చూడాలని కోరుతున్నారు. 

ఆరు నెలల వేతనం మంజూరు...

గోపాలి మిత్రలకు సంబంధించి 9 నెలల వేతనాలు రావాల్సి ఉండగా ఈనెలలోనే ఆరు నెలల వేతనాలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి ట్రెజరీలో జమ చేయడం జరిగిందని, రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందిస్తాం. లక్ష్యం చేరుకోవడం లేదని వేతనాల్లో కోతలు విధించడం లేదు.

రాంజీ, అసిస్టెంట్ డైరెక్టర్, మెదక్